మైనర్లను పెళ్లాడిన వారికి కటకటాలే
- వేలమంది భర్తలకు శిక్ష తప్పదు
- అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ
గువాహటి : మైనర్లను పెళ్లిచేసుకున్న వేలమందిని రాబోయే ఐదారు నెలల్లో అరెస్టులు చేయిస్తామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ప్రకటించారు. 14 ఏళ్లలోపు బాలికలను పెళ్లి చేసుకుని భర్తలైనవారిని వదిలిపెట్టేది లేదని శనివారం గువాహటిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన స్పష్టంచేశారు.బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయడానికి వీలుగా పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి తాజా వ్యాఖ్యలు చేశారు.‘‘అమ్మాయిలకు వివాహ వయసు 18 ఏళ్లు. అంతకంటే తక్కువ వయసున్న వారిని పెళ్లిచేసుకున్నవారు యావజ్జీవ కారాగార శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుంది. తల్లి అయ్యేందుకు మహిళలు మరీ ఎక్కువ వయసు వరకు వేచి ఉండకూడదు. మాతృత్వం పొందడానికి 22 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు అనువైనది. ప్రతీ దానికి తగిన వయసు ఉండేలా దేవుడు మన శరీరాలను రూపొందించాడు’’ అని సీఎం చెప్పారు.
మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ కన్నుమూత
విశాఖపట్నం : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ (70) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖపట్నంలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వసంతకుమార్ స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా పూళ్ల గ్రామం ఉంగుటూరు నుంచి కాంగ్రెస్ తరఫున 2004,2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి,రోశయ్య,కిరణ్కుమార్రెడ్డి కేబినెట్లలో ఆయన మంత్రిగా పనిచేశారు. గ్రామీణాభివృద్ధి,పర్యాటక శాఖల బాధ్యతలను ఆయన నిర్వర్తించారు. 2014 ఎన్నికల తర్వాత నుంచి రాజకీయాలకు వసంతకుమార్ దూరంగా ఉంటున్నారు.ఆయన భౌతికకాయాన్ని విశాఖపట్నం నుంచి స్వగ్రామానికి తరలించేందుకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.