48 రోజులు విద్యార్థులకి వేసవిసెలవులు ప్రకటించిన తెలంగాణ సర్కార్
హైదరాబాద్ : ఏప్రిల్ 25నుంచి తెలంగాణలో స్కూళ్లకు వేసవి సెలవులను ప్రకటించింది ప్రభుత్వం. ఏప్రిల్ 21 ఫలితాల వెల్లడి, ఏప్రిల్ 24న అన్ని స్కూళ్లలో పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి 25 నుంచి సెలవులు ఇవ్వనున్నట్లు తెలిపింది. పాఠశాలలు అన్నీ తిరిగి జూన్ 12న ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకు అంటే 48రోజుల పాటు విద్యార్థులకు వేసవి సెలవులు. ఈమేరకు విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులకు సమ్మేటివ్ అసెస్ మెంట్ (ఎస్ఏ)-2 పరీక్షల తేదీల్లో మార్పులు చేసింది.
ఇప్పటికే విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 10 నుంచి ఎస్ఏ-2 పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది.పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 13 వరకు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులకు ఎస్ఏ-2 పరీక్షలను ఏప్రిల్ 12 నుంచి ప్రారంభించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది.మార్చి రెండో వారం నుంచి రాష్ట్రంలో స్కూళ్లను ఒంటిపూట నడపాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యార్థుల పరీక్షలు ఏప్రిల్ 12 నుంచి 17 వరకు, 6వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థుల పరీక్షలు ఏప్రిల్ 20 వరకు నిర్వహించనున్నట్లు పేర్కొంది.
ఫాంహౌస్లపై పొలీసుల దాడులు, 23మంది అరెస్ట్
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పలు ఫామ్ హౌస్ లపై ఎస్వోటీ పోలీసులు దాడులు చేశారు. నగర శివారు ప్రాంతాల్లో ఉన్న 32 ఫామ్ హౌసుల్లో తనిఖీలు నిర్వహించారు.నాలుగు ఫాం హౌసుల్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించారు. మొయినాబాద్లోని బిగ్బాస్ ఫామ్హౌస్, జహంగీర్ డ్రీమ్ వ్యాలీ , శంషాబాద్ పరిధిలోని రిప్లెజ్ ఫామ్ హౌస్, మేడ్చల్లోని గోవర్ధన్ రెడ్డి ఫామ్ హౌస్ లలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించిన పోలీసులు.. 23 మందిని అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి భారీగా మద్యం బాటిళ్లు, హుక్కా సామాగ్రి, ప్లేయింగ్ కార్డ్స్, 1.03 లక్షల నగదు, 7 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు.