బిఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న ఇకలేరు
హైదరాబాద్ : సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న (72) కన్నుమూశారు. గతకొంతకాలంగా గుండె, కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.సాయన్న తెదేపా (TDP)తో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.బీఎస్సీ,ఎల్ఎల్బీ చదివారు.సాయన్నకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.వివాదరహితుడిగా సాయన్న పేరు తెచ్చుకున్నారు.కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.సాయన్న తెదేపా తరఫున 1994, 1999,2004, 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు.2009లో కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకరరావు చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు.2014 తర్వాత సాయన్న భారాస (BRS)లో చేరారు.2015లో తితిదే పాలకమండలి సభ్యుడిగానూ పనిచేశారు. హుడా డైరెక్టర్గా 6సార్లు బాధ్యతలు నిర్వర్తించారు.వీధిబాలలకు పునరావాసంపై హౌస్ కమిటీ ఛైర్మన్గా చేశారు. 2018 ఎన్నికల్లో భారాస తరఫున కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
ఎమ్మెల్యే సాయన్న మృతిపట్ల ఐటీ,పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సంతాపం ప్రకటించారు.ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.సాయన్న కుటుంబసభ్యులకు దేవుడు మనోధైర్యం ప్రసాదించాలని మంత్రి నిరంజన్రెడ్డి ప్రార్థించారు.కేంద్రమంత్రి కిషన్రెడ్డి సాయన్న మృతిపట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.సాయన్న అందరితో ఆత్మీయంగా మాట్లాడేవారన్నారు.ఎమ్మెల్యే సాయన్న అకాల మరణంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ట్విటర్లో స్పందించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అకాల మరణం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అని ట్విటర్లో పేర్కొన్నారు.
ఎమ్మెల్యే సాయన్న మరణం పట్ల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.సాయన్న ఎంతో సౌమ్యుడు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో నగర ప్రజలకు ఎనలేని సేవలందించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అకాల మరణం దిగ్భ్రాంతిని కలిగించింది.ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని రేవంత్ ట్వీట్ చేశారు.