ఉపాధికార్డు రెన్యువల్కు తప్పిన బాధ!
* 54 ఏళ్ల వరకు చెల్లుబాటు
గతంలో పదో తరగతి ఉత్తీర్ణులైన వారు ఉపాధికల్పన కార్యాలయానికి పరుగెత్తి తమ వివరాలను నమోదు చేయించేవారు. ఒకసారి నమోదు చేయిస్తే మూడేళ్ల అనంతరం రెన్యువల్ చేసుకునేవారు. కాలానుగుణంగా ప్రైవేటు రంగంలో ఉద్యోగావకాశాలు మెరుగవడం, ముఖ్యంగా సాఫ్ట్వేర్రంగం విస్తరించాక ఉపాధికల్పన కార్యాలయం వైపు వెళ్లే వారి సంఖ్య తగ్గిపోయింది. నిరుద్యోగ యువత ఉపాధికల్పన కార్యాలయంలో తమ పేర్లు నమోదు చేసుకోవడం ఆపలేదు. రెన్యువల్ బాధ లేకుండా ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికన కార్డు జారీ చేస్తోంది.
* ఆన్లైన్లో దరఖాస్తులు Employment Card
ఉపాధికల్పన కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకునేవారు www.employment.telangana.gov.in వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలి. అభ్యర్థి కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే యూజర్ ఐడీ, పాస్వర్డ్ సాయంతో కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. నిరుద్యోగిగా పేరు నమోదు చేసుకుంటే తిరిగి రెన్యూవల్ చేసుకునే అవసరం లేకుండా అభ్యర్థి వయసు 54 ఏళ్ల వరకు కార్డు చెల్లుబాటు అవుతుంది. ఇదిలా ఉండగా జిల్లాలోని కార్యాలయాలు అభ్యర్థుల జాబితాలను www.ncs.gov.in జాతీయ స్థాయి వెబ్సైట్కు బదిలీ చేస్తారు. దీంతో స్థానికంగా, రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి.
కొన్నిశాఖల్లో తప్పక సమర్పించాలి
జిల్లా ఉపాధి కల్పనా అధికారి కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకున్నా ప్రభుత్వ ఉద్యోగం వస్తుందన్న గ్యారంటీ లేదంటూ నిరుద్యోగుల్లో నిర్లిప్తత నెలకొంది. అయినా కొన్ని ప్రభుత్వ శాఖలు ఉద్యోగ నియామకాల సమయంలో ఎంప్లాయిమెంట్ కార్డు అడుగుతున్నారు. వైద్యారోగ్యశాఖ, న్యాయశాఖ, కారుణ్యనియామకాల కింద ఉద్యోగాలు పొందే అభ్యర్థులకు వీటిని తప్పనిసరిగా కోరుతుండటంతో నిరుద్యోగులు గత్యంతరం లేక ఉపాధికల్పన కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకుంటున్నారు. వనపర్తి జిల్లా కార్యాలయంలో నెలకు సగటున 30మంది వరకు కొత్తగా పేర్లు నమోదు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు ల్యాప్స్ కాకుండా పేర్లు నమోదు చేసుకున్న వారు 4,296 మంది ఉన్నారు.
మరచిపోతామన్న బెంగ ఉండదు గతంలో మూడేళ్లకోసారి రెన్యువల్ చేసుకోవాల్సి వచ్చేది. కొత్త మార్గదర్శకాల నేపథ్యంలో ఇప్పుడు ఒకసారి నమోదు చేసుకుంటే వయసు పరిమితి దాటే వరకు రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని అనిల్కుమార్, జిల్లా ఉపాధి కల్పన అధికారి, వనపర్తి ఒక ప్రకటన లో పేర్కొన్నారు.