ట్రాక్టర్ నడిపే వాళ్లకు...రైతులకు శుభవార్త..!!
- డ్రైవర్ లేకుండా ట్రాక్టర్ నడుపొచ్చు
- డ్రైవర్ రహిత ట్రాక్టర్ గా దీనికి నామకరణం
- ట్రాక్టర్కు మైక్రో కంట్రోలర్ను అమర్చి
- ప్రిన్సిపల్ ఆచార్య కె.అశోక్రెడ్డి
వరంగల్ : రైతులకు శుభవార్త ఇక రైతులు ఎక్కడైనా కూర్చొని పొలంలో ట్రాక్టర్ను మొబైల్ సాయంతో నడపవచ్చు.డ్రైవర్ అవసరం లేకుండా గేర్లు అదే మార్చుకుంటుంది.ఎక్స్లేటరూ ఇచ్చుకుంటుంది. స్టీరింగ్ దానంతట అదే తిరుగుతుంది.ట్రాక్టర్ వెనక్కి,ముందుకు ఎటు కావాలంటే అటు నడిపేయవచ్చు.ఈ మేరకు వ్యవసాయంలో అన్నదాతకు ప్రయోజనకరంగా వరంగల్ ‘కిట్స్’ కళాశాల అధ్యాపకులు డ్రైవర్ లేకుండా ట్రాక్టర్ నడిపే పరిజ్ఞానాన్ని ఆవిష్కరించారు. ‘డ్రైవర్ రహిత ట్రాక్టర్’గా దీనికి నామకరణం చేశారు. మూడేళ్లపాటు శ్రమించి దీన్ని విజయవంతంగా అభివృద్ధి చేశారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక విభాగం (డీఎస్టీ) కింద 2020 ఫిబ్రవరిలో రూ.41 లక్షల విలువైన ఈ ప్రాజెక్టు మంజూరైంది. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విభాగాధిపతి డాక్టర్ నిరంజన్రెడ్డి కో-ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్గా, సహాయ ఆచార్యుడు షర్ఫుద్దిన్ వసీమ్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్గా, అధ్యాపకుడు నరసింహారెడ్డి ప్రాజెక్టుకు మెంటర్గా వ్యవహరించగా, బీటెక్ సీఎస్ఈ చివరి సంవత్సరం విద్యార్థి సాకేత్ ఈ ప్రాజెక్టులో పాలుపంచుకున్నాడు.
ట్రాక్టర్కు మైక్రో కంట్రోలర్ను అమర్చి, డ్రైవర్ అవసరం లేకుండానే క్లచ్, బ్రేకు, ఎక్స్లేటర్ తిరగడానికి మూడు యాక్చువేటర్స్ వినియోగించారు. స్టీరింగ్ తిరిగేందుకు మరో మోటార్ను అమర్చారు. డ్రైవర్ రహిత ట్రాక్టర్ను మొబైల్ ద్వారా నియంత్రించేలా రూపొందించామని ప్రిన్సిపల్ ఆచార్య కె.అశోక్రెడ్డి చెప్పారు. ఐవోటీ పరిజ్ఞానంతో సందేశం క్లౌడ్కు వెళుతుందని, అక్కడి నుంచి మొబైల్కు మనమిచ్చే ఆదేశాలు వస్తాయని వివరించారు. మన ఇంట్లో లేదా వేరే ఎక్కడినుంచైనా పొలంలో ట్రాక్టర్ను మొబైల్ ఫోన్తో నడిపించవచ్చని,45 హెచ్పీ ట్రాక్టర్పై ప్రాంగణంలో ప్రయోగాలు చేయగా సమర్థంగా నడుస్తోందని తెలిపారు.ట్రాక్టర్ ఉన్న రైతులు ఈ సాంకేతికతను అమర్చుకోవాలంటే రూ.20 వేలు ఖర్చవుతుందని వసీమ్ తెలిపారు.