ఎమ్మెల్యేలకు ఎర కేసులో..భారాస ఎమ్మెల్యే గువ్వల బాలరాజు..!!
హైదరాబాద్ : ఎమ్మెల్యేలకు ఎర కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని భారాస ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తమ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పారు. హైదరాబాద్లో మీడియాతో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీలను జేబు సంస్థలుగా వాడుతోందని ఆయన ఆరోపించారు. విచారణ సంస్థలతో తమను ఇబ్బంది పెట్టాలని కేంద్రం చూస్తోందన్నారు. తెలంగాణ సర్కారును కూల్చే కుట్ర ఎవరు చేశారో అందరికీ తెలిసిందేనని చెప్పారు. కేంద్రంలోని భాజపా సర్కారు తమను ఇబ్బంది పెడితే సహించేది లేదన్నారు.కేసును సీబీఐ(CBI)కి అప్పగించొద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం, భారాస ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు సోమవారం కొట్టివేసింది. సీబీఐకి అప్పగిస్తూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును తప్పుబట్టలేమని.. అందులో జోక్యం చేసుకోలేమని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసిన విషయం తెలిసిందే.