అంబేద్కర్ జయంతి రోజే సచివాలయం ప్రారంభం
- ఏప్రిల్ 14న ముహూర్తం ఖరారు చేసిన సీఎం
- పలువురి డిమాండ్లు, విమర్శల నేపథ్యంలో నిర్ణయం
- మూడు రాష్ట్రాల ముఖ్య నేతలకు ఆహ్వానం
హైదరాబాద్ : తెలంగాణ నూతన సచివాలయ భవనాన్ని చివరకు అందరి అభీష్టం మేరకు అంబేద్కర్ జయంతి రోజే ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఏప్రిల్ 14 ముహూర్తాన్ని ఖరారు చేశారు. అంతకుముందు ఫిబ్రవరి 17న కేసీఆర్ పుట్టినరోజు నాడు సచివాలయాన్ని ప్రారంభించాలని నిర్ణయించి, అందుకు ఏర్పాట్లు కూడా మొదలుపెట్టారు. ఇంతలో శాసనమండలి సభ్యుల ఎన్నికలకు షెడ్యూల్ రావడంతో ఎన్నికల కోడ్ అడ్డు వచ్చింది. దాంతో ఫిబ్రవరి 17 ముహూర్తం ఆగిపోయింది. తదుపరి ముహూర్తంపై సర్కారు ఆలోచనలో పడింది. అంబేద్కర్ పేరుతో నిర్మిస్తున్న సచివాలయాన్ని ఆయన జయంతి రోజే ప్రారంభించాలని గతం నుంచీ డిమాండ్లు ఉన్నాయి. ఇదే అంశంపై హౖకోర్టులో పిటిషన్లు దాఖలవడంతో పాటు కొంత చర్చ కూడా నడిచింది. ఎలాగూ వాయిదా వేశాం కనుక ఇక అంబేద్కర్ జయంతి రోజునే ప్రారంభిస్తే మేలన్న నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది.