ముఖ్యంగా పురుషులు...మినుములను తప్పనిసరిగా తినాల్సిందే !!
BLACK GRAM / మినుములు (మినప పప్పు)
ఆరోగ్యం : ప్రతిరోజూ మనం ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా దోశ, ఇడ్లీ, ఊతప్పం, వడ వంటి వాటిని ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటి తయారీలో మనం మినుములు (మినప పప్పు)ను ఎక్కువగా వాడుతూ ఉంటాం.మినప పప్పుతో గారెలను కూడా తయారు చేస్తూ ఉంటాం. మినప పప్పును తరచూ ఉపయోగిస్తూనే ఉంటాం.అందరి వంటిళ్లలోనూ మినప పప్పు ఎల్లప్పుడూ ఉంటుంది.ఆహార పదార్థాల తయారీలో మినప పప్పును ఉపయోగించినప్పటికీ దీని వల్ల కలిగే ప్రయోజనాల గురించి మాత్రం చాలా మందికి తెలియదు.మినప పప్పును ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది.
మినుములను ఆహారంగా తీసుకోవడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. నీరసాన్ని తగ్గించడంలో, శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడంలో మినుములు ఎంతగానో సహాయపడతాయి.మినుములను తరచూ ఆహారంగా తీసుకోవడం వల్ల వెన్నెముక దృఢంగా ఉంటుంది.నవ ధాన్యాలలో మినుములు కూడా ఒకటి.మనం ఉపయోగించే పప్పు దాన్యాలన్నింటి కంటే మినుములు ఎంతో బలవర్ధకమైనవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మినప పప్పులో పీచు పదార్థాలు,ఐరన్,పొటాషియం,ఫాస్పరస్ వంటి మినరల్స్ తోపాటు బి కాంప్లెక్స్ విటమిన్స్ కూడా అధికంగా ఉంటాయి. గాయాలను త్వరగా నయం చేసే గుణం మినుములకు ఉంటుంది.గాయాలు తగిలినప్పుడు మినుములతో తయారు చేసిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల గాయాలు త్వరగా మానుతాయి.మినుములను ఆహారంగా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.రక్త హీనత సమస్య తగ్గుతుంది. జీర్ణ శక్తి మెరుగుపడుతుంది.వెన్ను నొప్పి తగ్గుతుంది.
మినప పప్పును లేపనంగా చేసి ముఖానికి రాసుకోవడం వల్ల చర్మం మృదువుగా తయారవుతుంది. అధిక రక్తపోటుతో బాధపడేవారు మినప పప్పును ఆహారంగా తీసుకోవడం వల్ల ఇందులోని పొటాషియం రక్త పోటును తగ్గించడంలో సహాయపడుతుంది.కీళ్ల నొప్పులను తగ్గించే శక్తి కూడా మినుములకు ఉంది. కండరాలను ఆరోగ్యంగా ఉంచడంలో మినప పప్పు సహాయపడుతుంది. శరీరంలో వచ్చే నొప్పులు, వాపులు మినుములను ఆహారంగా తీసుకోవడం వల్ల తగ్గుతాయి.
బాలింతలు ఉన్న వారికి
బాలింతలకు మినపప్పును ఉపయోగించి చేసిన ఆహార పదార్థాలను ఇవ్వడం వల్ల పాల ఉత్పత్తి పెరుగుతుంది.గుండు మినుములను ఆహారంగా తీసుకోవడం కంటే పొట్టు కలిగిన మినుములను వాడడం వల్ల అధిక ప్రయోజనాలను పొందవచ్చు. మూత్రపిండాల పని తీరును మెరుగుపరచడంలో కూడా మినుములు ఉపయోగపడతాయి.మినప పప్పును ఆహారంగా తీసుకోవడం వల్ల మగ వారిలో వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది. దీంతో సంతానం కలిగే అవకాశాలు మెరుగు పడతాయి.
మినప పప్పుతో వంటలను తయారు చేసేటప్పుడు అందులో నెయ్యి, జీలకర్ర, కండ చక్కెర వంటి వాటిని వేసి తయారు చేయడం వల్ల అధిక ప్రయోజనాలను పొందవచ్చు.ఇక షుగర్ వ్యాధి గ్రస్తులు తరుచూ నీరసంగా ఉంటారు.అలాంటి వారు మినపప్పుతో చేసిన ఆహార పదార్థాలను తినడం వల్ల నీరసం తగ్గి బలంగా తయారవుతారు.మినప పప్పును వారంలో కనీసం రెండ్లు సార్లైనా ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మనం ఈ ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.