ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు' కోసం కేంద్రం మరో ముందడుగు
ఢిల్లీ Delhi News భారత్ ప్రతినిధి : ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు' (One Nation-One Election) కోసం కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ (Ram Nath Kovind) అధ్యక్షతన ఓ కమిటీని శుక్రవారం ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా లోక్ సభ, శాసన సభలకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించేందుకు కల అవకాశాలను పరిశీలించేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఇతర సభ్యుల పేర్లతో ఓ నోటిఫికేషన్ త్వరలోనే విడుదల కాబోతోంది. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా ఈ వివరాలను తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 18 నుంచి 22 వరకు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ గురువారం ఇచ్చిన ట్వీట్లో ఈ వివరాలను తెలిపారు. ఈ సమావేశాల్లో ఉమ్మడి పౌర స్మృతి బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు, 'ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు' బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. లోక్ సభ, శాసన సభలకు ఒకేసారి ఎన్నికలు జరిగితే ఓటర్లు ఎంపీలు, ఎమ్మెల్యేలను ఒకే రోజున ఎన్నుకోవచ్చు.