మహిళా ఉద్యోగి పిల్లలకే పింఛను
* నామినీగా తొలి ప్రాధాన్యం వారికి ఇవ్వొచ్చు
*పౌర సర్వీసుల(ఫ్యామిలీ పెన్షన్) నిబంధనలకు సవరణ
* కేంద్రం కీలక నిర్ణయం
ఢిల్లీ Delhi News భారత్ ప్రతినిధి : సామాజికంగా, ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపే కీలక నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుందిప్రభుత్వ మహిళా ఉద్యోగులు, మహిళా పింఛనుదారులు తమ మరణానంతరం కుటుంబ పింఛన్ను భర్తకు కాకుండా కుమారుడికో కుమార్తెకో చెందేట్లు నామినేట్ చేయవచ్చని సోమవారం ప్రకటించింది. మహిళలకు సమాన హక్కులు కల్పించే దిశగా ప్రధాని మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని కేంద్ర సిబ్బంది వ్యవహారాల సహాయ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఇంతవరకు మహిళా ఉద్యోగి లేదా పింఛనుదారు తన తదనంతరం కుటుంబ పింఛన్ను ఆమె భర్తకు, అతడి మరణానంతరం పిల్లలకు చెందేలా పేర్లను ప్రతిపాదించే వారు. ఇకపై భర్తకు కాకుండా నేరుగా పిల్లలకే పింఛన్ చెల్లించడానికి వీలుగా 2021నాటి కేంద్ర పౌర సర్వీసుల (కుటుంబ పింఛన్) నిబంధనలను కేంద్ర పింఛన్, పింఛనుదారుల సంక్షేమ విభాగం సవరించిందిభార్యాభర్తలు విడాకులు తీసుకున్న సందర్భాలతో పాటు గృహ హింస నిరోధ చట్టం, వరకట్న నిషేధ చట్టం,
భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ) కింద కేసులు దాఖలైన సందర్భాలలోనూ పింఛను చెల్లింపులో తలెత్తే సమస్యలను తాజా సవరణ ద్వారా పరిష్కరించడం సులభమవుతుందని మంత్రి తెలిపారు.లిఖితపూర్వక విజ్ఞాపన చేయాలితన మరణానంతరం భర్తకు కాకుండా పిల్లలకు కుటుంబ పింఛన్ను చెల్లించాలంటే...మహిళా ఉద్యోగి తన విభాగాధిపతికి లిఖితపూర్వక విజ్ఞాపనను సమర్పించాల్సి ఉంటుంది. ఆమె తదనంతరం అది అమలులోకి వస్తుంది. పిల్లలు లేని సందర్భాలలో భర్తకే పింఛన్ అందుతుంది. కుమార్తె లేక కుమారుడు మైనర్ అయినా, మానసిక వైకల్యంతో బాధపడుతున్నా వారి సంరక్షకుడైన తండ్రి (భర్త)కి పింఛన్ చెల్లిస్తారు. సదరు కుమార్తె లేక కుమారుడు మేజర్ అయిన తరవాత వారికే పింఛన్ లభిస్తుంది. మహిళా పింఛన్దారు మరణిస్తే ఆమె భర్త సజీవంగా ఉన్నా, పిల్లలు మేజర్ అయితే వారికే పింఛన్ అందుతుంది. ఈ మేరకు మహిళా ప్రభుత్వోద్యోగి ముందుగానే లిఖితపూర్వక దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది.