గ్యాస్ కరెంట్ పథకాలు ప్రారంభం ఆ రోజే... సీఎం రేవంత్ ప్రకటన
మేడారం Madaram News భారత్ ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీల్లో మరో రెండింటి అమలుకు ముహూర్తం ఖరారైంది. రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ గ్యారంటీలను ఫిబ్రవరి 27న సాయంత్రం ప్రారంభించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ పథకాల ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీ హాజరవుతారని చెప్పారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రత్యేక హెలికాప్టర్లో మేడారం వెళ్లి సమ్మక్క- సారలమ్మలను రేవంత్ దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వన దేవతలను కోరుకున్నా. ములుగు జిల్లాతో, మంత్రి సీతక్కతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ముఖ్యమైన కార్యక్రమాలన్నీ మేం ఇక్కడి నుంచే ప్రారంభించాం. ‘హాథ్ సే హాత్ జోడో యాత్ర’ ఇక్కడి నుంచే ప్రారంభించా. మేడారం జాతరలో భక్తులకు ఇబ్బందులు రాకుండా రూ.110 కోట్లు మంజూరు చేశాం’’ అని చెప్పారు.మేడారంపై ఎందుకీ వివక్ష? మేడారం జాతరపై వివక్ష చూపడం సరికాదు. జాతీయ పండుగగా ప్రకటించడం సాధ్యం కాదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పినట్లుగా పత్రికల్లో చూశాను. .
కేంద్రం కుంభమేళాను జాతీయ పండుగగా నిర్వహిస్తోంది. రూ.వందల కోట్లు విడుదల చేసింది. దక్షిణాది కుంభమేళా మేడారం జాతరకు మాత్రం కేవలం రూ.3 కోట్లు కేటాయించింది. తెలంగాణను కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందనేందుకు ఈ జాతర పట్ల వ్యవహరిస్తున్న తీరే నిదర్శనం. అయోధ్యలో రాముడిని దర్శించుకోవాలని ప్రధాని మోదీ, అమిత్ షా చెప్పారు. ఆ మాదిరిగానే మేడారం జాతరను వారిద్దరూ వచ్చి దర్శించుకోవాలి. వారిని అధికారిక హోదాలో స్వాగతం పలికే బాధ్యతను నేను, మంత్రివర్గం చూసుకుంటాం. మేడారానికి జాతీయ హోదా ఇవ్వలేమంటూ కిషన్ రెడ్డి ఆదివాసీలను అవమానించొద్దు. సీఎం కేసీఆర్ మేడారం సందర్శించుకోకపోవడం వల్ల భారీ మూల్యం చెల్లించుకున్నారు. భవిష్యత్తులో మీకూ అదే పరిస్థితి వస్తుందని కిషన్ రెడ్డికి చెబుతున్నా. కేంద్రం ఉత్తర, దక్షిణ భారతం అంటూ వివక్ష చూపడం మంచిది కాదు. దక్షిణ భారత్లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా మేడారం జాతరకు గుర్తింపు ఉంది.