కోడ్ ముగిశాక వేగంగా కొలువుల భర్తీ
* పరిపాలన కసరత్తు పూర్తి చేస్తున్న టీఎస్పీఎస్సీ
* త్వరలో రాతపరీక్షల తుది కీల వెల్లడి, సర్టిఫికెట్ల పరిశీలనకు సమాయత్తం
* 27 ప్రకటనలు.. 18వేలకుపైగా ఉద్యోగాలు
* కీ సమస్యలకు చెక్..
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలను వేగంగా భర్తీ చేసేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే నిర్వహించిన రాతపరీక్షల తుది ఫలితాలను పార్లమెంటు ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే వెలువరించాలని భావిస్తోంది. అప్పటివరకు రాతపరీక్షల తుది కీల వెల్లడి, జనరల్ ర్యాంకు జాబితాల ప్రకటన, ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తిచేయనుంది. ఈ మేరకు రెండు రానున్న నెలల్లో పూర్తిచేయాల్సిన పనులపై కార్యాచరణ సిద్ధం చేస్తోంది.27 ప్రకటనలు.. 18వేలకుపైగా ఉద్యోగాలు టీఎస్పీఎస్సీ 2022 నుంచి ఇప్పటివరకు 18 వేలకు పైగా కొలువులతో మొత్తం 27 ఉద్యోగ ప్రకటనలు జారీ చేసింది. 2023లో ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా గ్రూప్-1తోపాటు 5 ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన రాతపరీక్షలు రద్దయ్యాయి. అనంతరం మళ్లీ నిర్వహించినా సాంకేతిక కారణాలతో ఫలితాలు వెల్లడికాలేదు. కొత్తగా ఏర్పాటైన రాష్ట్ర ప్రభుత్వం మాజీ డీజీపీ మహేందర్రెడ్డి ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ బోర్డును పునర్నియమించింది. కొత్త బోర్డు రెండు నెలల్లోనే మూడు నోటిఫికేషన్ల నియామక ప్రక్రియ పూర్తిచేసి, 10 ఉద్యోగ ప్రకటనలకు జనరల్ ర్యాంకు జాబితాలు ప్రకటించింది. కొత్తగా గ్రూప్-1 ప్రకటన జారీ చేయడంతోపాటు కీలకమైన గ్రూప్-2, 3తోపాటు డీఏవో, వసతి గృహ సంక్షేమాధికారుల పోస్టులకు రాతపరీక్ష తేదీలను ప్రకటించింది. జనరల్ ర్యాంకు జాబితాలు ప్రకటించిన నోటిఫికేషన్లకు త్వరలోనే ధ్రువీకరణ పత్రాల పరిశీలన చేపట్టనుంది.
ఇందులో భాగంగా జిల్లా స్థాయి పోస్టులైన గ్రూప్-4 ఖాళీల భర్తీకి త్వరలోనే 1:3 నిష్పత్తిలో మెరిట్ జాబితాలు వెలువరించనున్నారు. ఏఈఈ పోస్టులకు సాధారణ అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన ముగిసింది. క్రీడా అభ్యర్థుల పరిశీలన పూర్తయిన వెంటనే తుది ఫలితాల వెల్లడికి కార్యాచరణ పూర్తిచేయనుంది. ఏఈ పోస్టులకు త్వరలోనే తుది కీ వెలువరించనుంది. ఇంటర్ విద్యా విభాగంలో 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టులకు 2022 డిసెంబరులో ఉద్యోగ ప్రకటన జారీ అవగా 2023 అక్టోబరులో రాత పరీక్షలు పూర్తయ్యాయి. వారం, పది రోజుల్లో కీ వెల్లడించాలని భావిస్తోంది.కీ సమస్యలకు చెక్ రాతపరీక్షల ప్రాథమిక కీ అనంతరం అభ్యంతరాలకు తావులేకుండా కమిషన్ చెక్ పెడుతోంది. గతంలో ప్రశ్నపత్రం రూపొందించిన సమయంలో నిర్ణయించిన సమాధానాన్ని ప్రాథమిక కీగా ఇచ్చేవారు. అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకుని, సబ్జెక్టు నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసి తుది నిర్ణయం తీసుకునేవారు. దీనివల్ల ఓ వైపు జాప్యం.. మరోవైపు అభ్యర్థుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొనేవి. ఈ నేపథ్యంలో ముందుగానే సబ్జెక్టు కమిటీ జవాబులు పరిశీలించి ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రాథమిక కీ వెలువరిస్తోంది. దీంతో అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు దాదాపు తగ్గిపోతున్నాయి. అప్పటికీ ఏమైనా ఉంటే.. మరోసారి పరిశీలించి తుదికీ వెలువరిస్తోంది.