రాష్ట్రంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద నాలుగు అంచెల భద్రత : సీఈవో వికాస్ రాజ్
ఢిల్లీ Delhi News News భారత్ ప్రతినిధి : రాష్ట్రంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద నాలుగు అంచెల భద్రత ఉంటుందని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కౌంటింగ్ కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లేందుకు అనుమతి లేదని తెలిపారు. స్ట్రాంగ్ రూం నుంచి లెక్కింపు కేంద్రం వరకు పటిష్ట భద్రత ఉంటుందని అన్నారు. జూన్ 4న పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఉదయం 8 గంటలకు, ఈవీఎంల్లోని ఓట్ల లెక్కింపు 8.30గంటలకు ప్రారంభం అవుతుందని అన్నారు. మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో అత్యధికంగా 24 రౌండ్లలో లెక్కింపు ఉంటుందని వెల్లడించారు. శనివారం సాయంత్రం ఎగ్జిట్ ఫోల్స్ వెలువడనుండగా నియమాలను తెలియజేశారు.ఎన్నికల్లో రాష్ట్రంలో 3.32 కోట్ల మంది అభ్యర్థులు ఓటు హక్కు వినియోగించుకోగా అందుకోసం 35,808 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయని వెల్లడించారు. పోస్టల్ బ్యాలెట్ ను లెక్కించేందుకు 19 కౌంటింగ్ కేంద్రాలు , 276 టేబుల్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. 135 స్కానింగ్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా 34 కేంద్రాల్లో కౌంటింగ్ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటల లోపు కౌంటింగ్ పూర్తయ్యే అవకాశం ఉందని అన్నారు. కౌటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేందుకు అన్ని రకాల ఏర్పాట్లను చేశామన్నారు. సర్వీసు ఓటర్ల కోసం కేటాయించిన ఇటిపిబి ఓట్ల లెక్కింపు కూడా..పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కేంద్రంలోనే నిర్వహించనున్నారు. వీటి కోసం వేరుగా టేబుళ్లను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా వివి ప్యాట్ స్లిప్పుల లెక్కింపు కోసం ఇవిఎం ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ప్రత్యేక క్యాబిన్ ఏర్పాటు చేశారు. ఫలితాలను ప్రకటించడం కోసం బోర్డులను అందుబాటులో ఉంచారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతతో పాటు బారికేడింగ్ ఏర్పాటు చేశారు.