కళ్యాణ లక్ష్మి చెక్కులకు ఆగస్టు వరకు గడువు
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల గడువు ముగుస్తోందన్న వాదనలో నిజం లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.అర్హులైన లబ్ధిదారులకు వాటిని అందిస్తామని తెలిపింది. ఇప్పటికే 71 చెక్కులను పంపిణీ చేసినట్లు హైకోర్టు దృష్టికి తెచ్చింది. కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాల చెక్కుల కాలపరిమితి ఈనెల 27తో ముగియనున్నందున వాటి పంపిణీకి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్పై బుధవారం మరోసారి జస్టిస్ సూరేపల్లి నందా ధర్మాసనం విచారణ చేపట్టింది.ప్రభుత్వం తరఫున ఏఏజీ ఇమ్రాన్ఖాన్ వాదిస్తూ ఈ చెక్కులకు ఆగస్టు వరకు సమయం ఉందని తెలిపారు. ఒక్క చెక్కు కూడా మురిగిపోదని, లబ్ధిదారులకు అందజేస్తామని చెప్పారు. వివరాలతో కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని ఏఏజీ కోరడంతో తదుపరి విచారణ వచ్చే నెల 15కు వాయిదా వేసింది.