దావోస్ పెట్టుబడులు కాంగ్రెస్ ప్రభుత్వ అతిపెద్ద విజయం
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : ఇటీవల స్విట్జర్లాండ్లోని దావోస్ వేదికగా జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలంగాణకు రికార్డ్ స్థాయిలో పెట్టుబడులు వచ్చిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ టీమ్ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెట్టుబడులను సాధించింది. మొత్తం నాలుగు రోజుల పాటు జరిగిన దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో 16 కంపెనీలతో ఒప్పందాల ద్వారా 1.78 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్శించింది తెలంగాణ. ఈ క్రమంలో దావోస్ పర్యటన వివరాలను సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం (జనవరి 28) మీడియాకు వెల్లడించారు.
సెక్రటేరియట్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది దావోస్ పర్యటనలో తెలంగాణకు మొత్తం రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు తెలిపారు. ఇంకా ఎన్నో కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి చూపాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం మీద నమ్మకంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన కంపెనీలకు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. మా ప్రభుత్వం అవలంభిస్తోన్న విధానాలే నేడు రాష్ట్రానికి భారీ పెట్టుబడులు రావడానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. రాష్ట్రానికి రికార్డ్ స్థాయిలో పెట్టుబడులు రావడం మా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో అతిపెద్ద విజయమన్నారు.